పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల.. వరంగల్లో కలకలం
వరంగల్లో ఓ పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల కనిపించడం కలకలం రేపింది. ఎస్ఆర్ఆర్ తోట సమీపంలోని కిరాణ దుకాణంలో కొనుగోలు చేసిన పెరుగు ప్యాకెట్ను ఇంటికి తీసుకెళ్లి తెరిచిన వినియోగదారుడు రఘునందన్ అందులో ఎలుక పిల్ల ఉండటాన్ని గుర్తించి షాక్కు గురయ్యారు.
ఈ విషయమై వెంటనే దుకాణదారుడిని నిలదీయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు. ఎలుక కనిపించిన బ్యాచ్కు చెందిన పెరుగు ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అలాగే సంబంధిత ప్యాకెట్లోని పెరుగును సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.
పెరుగు తయారీ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేయగా, ఆహార ఉత్పత్తుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.