పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సింగరేణి విశ్రాంత ఉద్యోగుల నిరసన
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఆవరణలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన నిర్వహించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజల జీవనం మరింత భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ధరలు పెంచాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, యుద్ధ నివారణ చర్యలపై దృష్టి పెట్టకుండా ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. ధరల పెంపుతో మధ్యతరగతి ప్రజల నడ్డి విరిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు, బీసీ సంఘాల నాయకుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు భీమ్సేన్, కార్యదర్శి సతీష్, నాయకులు భిక్షపతి, అశోక్, రాజేశం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు