పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన.. సీసీ కెమెరాల ఏర్పాటుకు సూచనలు
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పన్నంరెడ్డిపల్లి గ్రామంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించిన "పల్లె నిద్ర" కార్యక్రమంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభశేఖర్ పోలీసు సిబ్బందితో కలిసి గ్రామ ప్రజలతో మమేకమయ్యారు.
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనలతో, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఎస్ఐ శుభశేఖర్, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయాల వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గంజాయి విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్-112కు తెలియజేయాలని సూచించారు.
ఇంటి దొంగతనాల నివారణలో భాగంగా ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాటి వల్ల నేరాలను అరికట్టడం సులభమవుతుందని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు సమాచారం అందిస్తే పది నిమిషాల్లోపు పోలీసు సహాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్లైన్ను సంప్రదించాలని సూచించారు. అలాగే మత్తు పదార్థాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు.
"పల్లె నిద్ర" కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో భద్రతపై విశ్వాసాన్ని పెంపొందించడం, పోలీసు-ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమేనని ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలను గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆయన హామీ ఇచ్చారు.