పల్లె వెలుగు బస్సుకు Express బోర్డు - ప్రయాణికులపై అదనపు భారం
పల్లె వెలుగు బస్సుకు ‘ఎక్స్ప్రెస్’ బోర్డు!
మంచిర్యాల - కరీంనగర్ రూట్లో ప్రయాణికులపై అదనపు భారం
వెల్గటూర్ వద్ద నిలదీసిన ప్రయాణికులు.. ఇదేం నిలువుదోపిడీ అని ఆగ్రహం
వెల్గటూర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులను సాధారణ చార్జీలతో నడపాల్సింది పోయి, వాటికి ‘ఎక్స్ప్రెస్’ బోర్డులు తగిలించి ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మంచిర్యాల డిపోకు చెందిన TS 19 TA 6555 నెంబర్ గల పల్లె వెలుగు బస్సు (గ్రీన్ కలర్) వెనుక భాగంలో స్పష్టంగా పల్లె వెలుగు అని ఉన్నప్పటికీ, దానికి ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టి రూట్ నడుపుతుండడం తీవ్ర దుమారం రేపుతోంది.
నిలువు దోపిడీ.. ప్రయాణికుల ఆగ్రహం:
మంచిర్యాల నుండి కరీంనగర్ వెళ్లే ఈ పల్లె వెలుగు బస్సు.. మంగళవారం వెల్గటూర్ ప్రయాణ ప్రాంగణానికి (బస్టాండ్) చేరుకోగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. బస్సు చూస్తే పల్లె వెలుగు.. కానీ టికెట్ చార్జీలు మాత్రం ఎక్స్ప్రెస్ పేరిట వసూలు చేస్తుండడంతో కండక్టర్, డ్రైవర్లను నిలదీశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించినప్పటికీ, పురుషులు మరియు సాధారణ ప్రయాణికులపై ఈ రకంగా అదనపు చార్జీల భారం మోపడం ఏంటని ప్రయాణికులు మండిపడుతున్నారు.
స్పీడ్ అదే.. చార్జీలు ఎందుకు ఎక్కువ?
"పల్లె వెలుగు బస్సుకు ఎక్స్ప్రెస్ బోర్డు తగిలిస్తే అది ఏమైనా గాల్లో తేలుతూ ఎక్కువ స్పీడ్తో వెళ్తుందా? పర్మిట్ స్పీడ్, వెళ్లే రూట్ అంతా ఒకటే అయినప్పుడు ఎక్స్ప్రెస్ చార్జీలు ఎందుకు వసూలు చేయాలి?" అని ప్రయాణికులు నిలదీస్తున్నారు. కేవలం బోర్డు మార్చి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడం నిలువు దోపిడీ కాదా అని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు లాభాల కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కడం మానుకోవాలని, వెంటనే పల్లె వెలుగు బస్సులకు సాధారణ చార్జీలనే వసూలు చేయాలని వెల్గటూర్, మంచిర్యాల ప్రాంత ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు