పోలవరంలో నాటు సారా తయారీకి సిద్ధం చేసిన 50 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న “నవోదయం 2.0” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించి సంఘటనా స్థలంలోనే ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలవరం గ్రామానికి చెందిన కలవకొల్లు రెడ్డయ్యపై కేసు నమోదు చేసినట్లు నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.
ఏలూరు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, నిల్వలు, బెల్ట్ దుకాణాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నాటు సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటను భూముల్లో నిల్వ ఉంచే భూ యజమానులపైనా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు 9440902462 నంబర్కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.