న్యూయార్క్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. మత పెద్దల సంచలన ఆరోపణలు ‘ముందే తెలిస్తే హాజరయ్యేవాళ్లం కాదు.. మమ్మల్ని తప్పుదోవ పట్టించారు’
న్యూయార్క్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ పాల్గొన్న న్యూయార్క్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. తమను అంతర్మత సమావేశం పేరుతో ఆహ్వానించి, ఆ కార్యక్రమం ఆర్ఎస్ఎస్కు సంబంధించినదని ముందుగా వెల్లడించలేదని అమెరికాకు చెందిన ఇద్దరు మత నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. విషయం తెలిసి ఉంటే తాము కార్యక్రమానికి హాజరయ్యేవాళ్లం కాదని స్పష్టం చేశారు.
ఆగస్టు 29న న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ‘వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 5,000 మందికి పైగా అమెరికన్ హిందువులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మోహన్ భగవత్ ప్రసంగించారు.
అయితే కార్యక్రమానికి ముందు నుంచే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆగస్టు 25న ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్తో పాటు పలు సామాజిక, మత సంస్థలు న్యూయార్క్లో విలేకరుల సమావేశం నిర్వహించి కార్యక్రమాన్ని వ్యతిరేకించాయి. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా కార్యక్రమంపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
‘మమ్మల్ని మోసం చేసి కార్యక్రమానికి తీసుకొచ్చారు’
న్యూయార్క్లోని రివర్సైడ్ చర్చ్కు చెందిన మంత్రి అడ్రియెన్ థోర్న్ సెప్టెంబర్ 2న విడుదల చేసిన వీడియో సందేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సుమారు ఆరు వారాల పాటు ‘వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్’ నుంచి తనకు పలుమార్లు ఆహ్వానాలు వచ్చాయని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని తనకు అంతర్మత సమావేశంగా పరిచయం చేశారని, ఆర్ఎస్ఎస్ లేదా హిందూ జాతీయవాదంతో సంబంధం ఉన్న సంస్థ గురించి ఎక్కడా వెల్లడించలేదని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో తాను కనిపించడం ‘భయంకరమైన తప్పిదం’ అని ఆమె అభివర్ణించారు. ఆహ్వానితులకు పంపిన కార్యక్రమ వివరాల్లో గౌరవ అతిథి పేరును ఖాళీగా ఉంచి, చివరకు ఆ స్థానంలో మోహన్ భగవత్ను ఉంచినట్లు తనకు తెలిసిందన్నారు.
‘ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ నాయకుడిని కేంద్రంగా చేసుకుని జరుగుతోందని ముందే తెలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరయ్యేదాన్ని కాదు’ అని థోర్న్ స్పష్టం చేశారు.
ఇమామ్ షంసీ అలీ కూడా వివరణ
థోర్న్ ఆరోపణల అనంతరం న్యూయార్క్కు చెందిన ప్రముఖ ముస్లిం మత నాయకుడు, అంతర్మత కార్యకర్త ఇమామ్ షంసీ అలీ కూడా స్పందించారు.
ది పియర్ హోటల్లో జరిగిన అనుబంధ అల్పాహార సమావేశానికి హాజరు కావడం తీవ్రమైన నిర్ణయపరమైన తప్పిదం అని ఆయన పేర్కొన్నారు. ‘వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ’ పేరుతో జరిగే సమావేశానికి తనను ఆహ్వానించారని, అయితే మోహన్ భగవత్ ప్రధాన అతిథిగా ఉంటారని తనకు ముందుగా చెప్పలేదని తెలిపారు.
భగవత్ను సత్కరించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ముందే తెలిసి ఉంటే ఆహ్వానాన్ని వెంటనే తిరస్కరించేవాడినని అలీ అన్నారు. కార్యక్రమ స్వరూపం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన తదుపరి కార్యక్రమానికి తాను హాజరు కాలేదని వివరించారు.
12 ఆహ్వానాల్లోనూ భగవత్ పేరు లేదన్న ఆరోపణ
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. జూలై, ఆగస్టు నెలల్లో మత నాయకులకు నిర్వాహకులు పంపిన 12 ఇమెయిళ్లలో ఆర్ఎస్ఎస్ లేదా మోహన్ భగవత్ పేర్లు ప్రస్తావించలేదని పేర్కొంది.
ఈ ఆహ్వానాల సమన్వయకర్తగా బావా జైన్ వ్యవహరించారు. తాను అంతర్మత నాయకుడిగా పరిచయం చేసుకునే జైన్కు ‘వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ లీడర్స్’, ‘సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్’ వంటి సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న తరువాత థోర్న్ జైన్ను వివరణ కోరినట్లు తెలుస్తోంది. భగవత్ భద్రతకు సంబంధించిన కారణాల వల్ల ఆయన పేరును ముందుగా వెల్లడించలేదని జైన్ వివరణ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
అయితే భద్రత కారణం చూపి ప్రజలను తప్పుదోవ పట్టించడం సమర్థనీయం కాదని థోర్న్ అభిప్రాయపడ్డారు.
‘భగవత్ వస్తారని ఏడాది ముందే తెలుసు’
మరోవైపు భగవత్ను కార్యక్రమానికి ఆహ్వానించడంపై తాను విచారం వ్యక్తం చేయడం లేదని బావా జైన్ తెలిపారు. భగవత్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తనకు ఏడాది ముందే తెలుసని, మత నాయకులు కూడా కార్యక్రమానికి హాజరై ఆయన మాటలను నేరుగా వినాలని తాను కోరుకున్నానని చెప్పారు.
అయితే కార్యక్రమానికి హాజరైన మరో వ్యక్తి అనంతరం భగవత్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నట్లు సమాచారం.
‘కట్టుబాట్లను’ ఆర్ఎస్ఎస్ ప్రకటనగా మార్చారన్న విమర్శలు
కార్యక్రమానికి ఆహ్వానించిన మత నాయకుల నుంచి కొన్ని ‘కట్టుబాట్లు’ లేదా ప్రతిజ్ఞలను తీసుకున్నారని విమర్శలు వచ్చాయి. అనంతరం వాటిని ఒక ప్రకటనగా రూపొందించి మోహన్ భగవత్ స్వయంగా చదివారని, ఆ ప్రకటనను ఆర్ఎస్ఎస్కు అనుబంధమైన ‘ఆర్గనైజర్’లో ప్రచురించారని ఆరోపణలు వచ్చాయి.
తాము సమర్పించిన కట్టుబాట్లను ఆర్ఎస్ఎస్ అధినేత బహిరంగంగా విడుదల చేసి ప్రచారం చేస్తారని ఆహ్వానితులకు ముందుగా చెప్పలేదని విమర్శకులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో బావా జైన్కు చెందిన అంతర్మత సంస్థలు తమను స్వతంత్ర వేదికలుగా పరిచయం చేసుకున్నప్పటికీ, సంఘ్ పరివార్కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు, సంస్థలతో గతంలోనూ సంబంధాలు కొనసాగించాయని ఒక డోసియర్లో ఆరోపణలు వెలువడ్డాయి.
2000లో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్, 2007లో న్యూఢిల్లీలో జరిగిన హిందూ-యూదు నాయకత్వ సదస్సుల్లో జైన్ పాల్గొన్న విషయాన్ని కూడా ఆ డోసియర్ ప్రస్తావించింది. ఆ సమావేశాలకు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్కు చెందిన నాయకులు కూడా హాజరైనట్లు పేర్కొంది.
మొత్తంగా మోహన్ భగవత్ పాల్గొన్న న్యూయార్క్ కార్యక్రమం అంతర్మత సంభాషణ వేదికా? లేక ముందస్తు సమాచారం లేకుండా మత పెద్దలను ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగస్వాములను చేసిన చర్యా? అనే అంశంపై అమెరికాలో చర్చ కొనసాగుతోంది.