పరాభవనామ సంవత్సరం అగ్నిపరీక్షే..!
పరాభవనామ సంవత్సరం అగ్నిపరీక్షే..! సీపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్
నూతన సంవత్సరం ఆరంభ వేడుకలే అధికార తెలుగుదేశం పార్టీకి అగ్నిపరీక్షగా మారాయి. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. కేసు నమోదైనా, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ కేసు ఇమేజ్ను కాపాడుకునేందుకే షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని చూస్తున్నారని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఇదే సమయంలో నెల్లూరులో గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి పెంచలయ్యను పట్టపగలు హత్య చేయడం రాష్ట్రాన్ని కుదిపేసింది. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో “డబుల్ ఇంజిన్ సర్కార్” పూర్తిగా విఫలమైందని హరినాథ్ మండిపడ్డారు.
చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే నేతలు, తెనాలిలో గంజాయి పేరుతో యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి అవమానకరంగా ఊరేగించిన ఘటనపై మౌనం వహిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో పుట్టా మహేష్ రక్త పరీక్షలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినప్పటికీ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా “దండుపాలెం గ్యాంగ్”లా విస్తరించి, రాజకీయ పార్టీలకు అతీతంగా చీకటి సామ్రాజ్యంగా మారిందని, పోలీసులపై కాల్పులు జరిపే స్థాయికి పరిస్థితులు దిగజారాయని ఆయన హెచ్చరించారు. ఇది నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే సంకేతమని అన్నారు.
మరోవైపు మద్యం ప్రవాహం, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని, అయినా క్రైమ్ రేట్ తగ్గిందని ప్రకటిస్తున్న హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలను హరినాథ్ ఖండించారు.
సొంత పార్టీ ఎంపీలను అదుపులో పెట్టలేని ప్రభుత్వం, కనీసం నూతన సంవత్సరంలోనైనా కఠిన చర్యలు తీసుకుని రాష్ట్ర ప్రజలను మద్యం, గంజాయి మాఫియా బారిన పడకుండా కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.