ప్రాకార మండపం నిర్మాణంలో నాణ్యతపై భక్తుల ఆందోళన
గొల్లప్రోలు పట్టణంలోని పురాతన శ్రీ సీతారామస్వామి దేవస్థానం (విష్ణాలయం) ప్రాకార మండపం నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో ప్రాకార మండపం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ 2025 ఏప్రిల్ 25న రూ.1.32 కోట్ల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు. ఈ పనులకు భక్తులు కూడా మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో రూ.44 లక్షలు అందించారు.
అయితే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పునాది నింపే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్ర గ్రావెల్ రాళ్ల మట్టిని ఉపయోగించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకుని ఆ మట్టిని తొలగించి గరి ఇసుకతో పునాది పనులు నిర్వహించారు.
ఇప్పుడు స్లాబ్ నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. స్లాబ్లో అమర్చాల్సిన ఎలక్ట్రికల్ వైరింగ్ పైపులు, ఫ్యాన్ హుక్లు ముందుగానే అమర్చకుండా తరువాత ఓపెన్ వైరింగ్ చేయాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు. దీనివల్ల ప్రాకార మండపం అందం తగ్గడంతో పాటు భవిష్యత్తులో భక్తుల భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదే విధంగా స్లాబ్ నిర్మాణానికి రెడీ మిక్స్ కాంక్రీట్ (RMC) వాడటంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని కాంక్రీట్ ఉపయోగిస్తే భవిష్యత్తులో పగుళ్లు వచ్చే అవకాశం ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రాకార మండపం నిర్మాణ పనులను అధికారులు సమగ్రంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పనులను కళాత్మకంగా, శాశ్వతంగా నిలిచేలా నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు.