ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన దంపతులకు అవమానం – ఫిర్యాదు తీసుకోని వత్సవాయి ఎస్సైపై ఆరోపణలు
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి: ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కోరుతూ పోలీస్ స్టేషన్కు వెళ్లిన యువ దంపతులకు ఎదురైన అనుభవం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇంటర్కాస్ట్ వివాహం చేసుకున్న ఈ జంటకు, ఫిర్యాదు స్వీకరించకుండా అవమానకరంగా ప్రవర్తించారని వత్సవాయి ఎస్సైపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితుల కథనం ప్రకారం, అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని చెప్పి రక్షణ కోరేందుకు వారు స్టేషన్కు వెళ్లగా, “మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకురావాలి, లేకపోతే ఫిర్యాదు తీసుకోలేం” అంటూ ఎస్సై నిర్లక్ష్యంగా మాట్లాడినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు.
చట్టపరంగా మేజర్ వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో వివాహం చేసుకోవడం నేరం కాదని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యతగా ఉండగా, ఫిర్యాదు స్వీకరించకుండా తిరస్కరించడం విమర్శలకు దారితీస్తోంది.
ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రాణభయంతో వచ్చిన వారినే తిరస్కరించడం, అవమానించడం పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత దంపతులకు తక్షణ రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.