పుంగనూరులో ప్రైవేట్ పాఠశాల బస్సుల తనిఖీలు నిర్వహించిన ఎంవీఐ సుప్రియ
NTODAY NEWS:- అన్నమయ్య జిల్లా, పుంగనూరు: పాఠశాలల సెలవుల నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, పాఠశాల బస్సులు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా ఫిట్గా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించినట్లు తెలిపారు. బస్సుల డాక్యుమెంట్లు, ఎమర్జెన్సీ డోర్లు, విండోలు, చిన్నారులు సురక్షితంగా ఎక్కేందుకు అవసరమైన మెట్లు తదితర అంశాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
ప్రతి స్కూల్ బస్సులో ఫైర్ డిటెక్షన్ మరియు ఆటోమేటిక్ అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే బస్సు డ్రైవర్లకు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలని, డ్రైవర్తో పాటు ఒక అటెండర్ను కూడా నియమించాలని ఆదేశించారు.
బస్సుల నాలుగు వైపులా పాఠశాల పేరు, ఫోన్ నంబర్ స్టిక్కర్ల రూపంలో కాకుండా శాశ్వతంగా పెయింట్ చేయించాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు.
విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యమని, అన్ని ప్రైవేట్ పాఠశాలలు రవాణా శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఎంవీఐ సుప్రియ స్పష్టం చేశారు.