ప్రభుత్వ బడి బలోపేతానికి అన్నారం గ్రామం వినూత్న నిర్ణయం
ప్రైవేట్ పాఠశాలల్లో గ్రామ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వొద్దని వినతి
ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ ప్రారంభం నేపథ్యంలో గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం
డొంకేశ్వర్, జూన్ 19 (ఎన్టుడే న్యూస్): ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామం ఆదర్శప్రాయమైన నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్నారం ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (ఎల్కేజీ, యూకేజీ) తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామంలోని చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) మరియు గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ నిర్ణయానికి అనుగుణంగా శుక్రవారం గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డొంకేశ్వర్లోని ఫ్రోబెల్ స్కూల్, ఎస్.ఎస్.వి. స్కూల్ యాజమాన్యాలను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నారం గ్రామానికి చెందిన విద్యార్థులకు కొత్తగా అడ్మిషన్లు కల్పించవద్దని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని వారు స్కూల్ యాజమాన్యాలను కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. గ్రామంలోని ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం అన్నారం గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.