ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి – ఎంఈఓ-2వి ఎస్ వి బ్రహ్మాచారి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మండల విద్యాశాఖ-2 అధికారి వి.ఎస్.వి. బ్రహ్మాచారి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు మూడు జతల యూనిఫాంలు, బెల్ట్, బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్తో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. అదనంగా “తల్లికి వందనం” పథకం కింద ప్రతి విద్యార్థి ఖాతాలో రూ.15 వేల ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిన్నంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చిన విషయాన్ని బ్రహ్మాచారి ప్రస్తావించారు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని 580 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, అదే పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 25 మంది ఉన్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలల్లో మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా చిన్నంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులను, మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో నలుగురు విద్యార్థులను చేర్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఈఎస్ రంగారావు, మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ మహబూబ్, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, వర్మరావు, రామకృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.