ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాలి
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకు సాగాలి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం
నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలపై అవగాహన, శిక్షణ అందించేందుకు ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడు నెలల ఉచిత పోటీ పరీక్షల శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే, ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ను 2015లో ప్రారంభించి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన పాఠశాలను ఏర్పాటు చేసి ఉచిత విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో కషాయ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన కిట్లను పంపిణీ చేశామని, మృతుల అంత్యక్రియల్లోనూ మానవతా సేవలు అందించామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని, నకిరేకల్ పట్టణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులు పట్టుదలతో చదివి పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, వారి లక్ష్య సాధనకు అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, సీనియర్ నాయకులు పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ బెల్లి యాదయ్య, ఆర్సీ రెడ్డి కోచింగ్ అధ్యాపకులు వేముల సైదులు, మండల పార్టీ అధ్యక్షుడు గాదగోని కొండయ్య, టౌన్ అధ్యక్షుడు లింగాల వెంకన్న, ఉద్దీపన కోఆర్డినేటర్ చెరుకు సతీశ్తో పాటు మాజీ కౌన్సిలర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.