ప్రభుత్వ విద్యావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూన్ 19: విద్యావ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి ఆయన విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరీ గోడ, అదనపు గదులు వంటి సౌకర్యాలు కల్పించడంతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేస్తున్నామన్నారు. కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో అదనపు తరగతి గదులు, భోజనశాలల నిర్మాణ పనులు చేపట్టి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, అధిక సంఖ్యలో అడ్మిషన్లు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు వివరించారు. అలాగే, రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల' నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా విద్యాశాఖ అధికారుల సమన్వయంతో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులను కోరారు. నాణ్యమైన విద్యను అందించడంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్య అభ్యసించి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా రంగంతో పాటు వైద్య రంగ అభివృద్ధి దిశగా కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మాతా శిశు ఆసుపత్రి ద్వారా ప్రజలకు అత్యుత్తమ, మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.