ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్
ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్: ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్!
చిలకలూరిపేట రూరల్:ఒంగోలుకు చెందిన న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) హత్య కేసులో ఆయన భార్య నాగజ్యోతి (30)ని రూరల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది.
హత్యకు ప్లాన్ ఇలా
నాగజ్యోతికి పెళ్లికి ముందే బాపట్ల జిల్లాకు చెందిన ఉసరి వెంకట కోటయ్య (40)తో అక్రమ సంబంధం ఉంది. భర్తను వదిలించుకుంటే తామిద్దరం కలిసి ఉండవచ్చని, పైగా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని వీరు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా హరిప్రసాద్ పేరిట ఇన్సూరెన్స్ చేయించి, నాగజ్యోతిని నామినీగా పెట్టారు.
యాక్సిడెంట్గా చిత్రీకరణ
ఈ ఏడాది ఏప్రిల్ 10న కోటయ్య తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి హరిప్రసాద్కు మద్యం తాగించాడు. అనంతరం యడవల్లి సమీపంలో ఇనుప రాడ్తో తలపై కొట్టి దారుణంగా హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శవాన్ని, స్కూటీని రోడ్డు పక్కన పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
కేసు ఛేదించిన పోలీసులు
పోలీసులు మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి దీనిని మర్డర్ కేసుగా నమోదు చేశారు. ఏప్రిల్ 12నే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, లోతుగా జరిపిన విచారణలో భార్య నాగజ్యోతి కుట్ర బయటపడింది. దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేసి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి క్లూస్ లేకపోయినా కేసును ఛేదించిన రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్.ఐ అనిల్ కుమార్లను పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు.