Madanapalle: ప్రజా ఫిర్యాదుల స్వీకరణలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.. సత్వర న్యాయమే లక్ష్యం
అన్నమయ్య జిల్లా | NTODAY NEWS
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు అందజేసే ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అర్జీల పరిష్కారంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులను ఆదేశించిన ఆయన, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని సూచించారు.
ప్రజలు జిల్లా పోలీసు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లలోనే నిర్భయంగా ఫిర్యాదులు సమర్పించవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. స్థానికంగా అందే ఫిర్యాదులను కూడా క్షుణ్ణంగా విచారించి, చట్టపరంగా త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.