ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ
బాధితులకు భరోసా.. సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో స్పష్టంగా తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గారు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
జిల్లాలోని నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ గారు నేరుగా ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను విన్నారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా
మాట్లాడి, ఆయా సమస్యలపై తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మరియు మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రత ఎలాంటిదైనా సరే, చట్ట పరిధిలో పూర్తిస్థాయి విచారణ జరిపి నిర్ణీత గడువు లోపల ఖచ్చితమైన పరిష్కారం అందించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.