ప్రజలు హక్కుల కోసం పోరాడాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు: ఓటు హక్కుతోనే వ్యవస్థ బలోపేతం
హైదరాబాద్: ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడకపోతే, వాటిని కాపాడుకునేందుకు ముందుకు రాకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, రూపాయి విలువ క్షీణత, యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి వంటి అంశాలు దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులని, తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అన్నారు. ప్రజలు గట్టిగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయం, సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని పేర్కొంటూ.. "జై హింద్, జై భీమ్, జై కాన్స్టిట్యూషన్" అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు.