ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
ముంబై, ఆగస్టు 5: బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో విలక్షణ ప్రతినాయకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాట్) కారణంగా తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బాలీవుడ్లో లగాన్ చిత్రంతో గుర్తింపు పొందిన ప్రదీప్ రావత్, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అనంతరం ఛత్రపతి చిత్రంలో పోషించిన ప్రతినాయకుడి పాత్రతో విశేష ఆదరణ పొందారు. తన గంభీరమైన నటనతో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ తదితర భాషల్లో 70కి పైగా చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
తెలుగులో ఆయన చివరిసారిగా గాయపడ్డ సింహం చిత్రంలో నటించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.
వ్యక్తిగత జీవితంలో తన ఏకైక కుమారుడిని హీరోగా చూడాలన్న కోరికతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఆయన మృతి చెందడం కుటుంబ సభ్యులను, అభిమానులను విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.