ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ప్రజావాణి
మండల స్థాయిలోనే ప్రజల సమస్యల స్వీకరణకు చర్యలు
ఖమ్మం, ఆగస్టు 16:
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే వినతులు స్వీకరించి పరిష్కరించే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు.
ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రజావాణితో పాటు ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
మండల కేంద్రాల్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ సమస్యలు, వినతులు, దరఖాస్తులను మండల స్థాయిలోనే సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.
మండల స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి నిబంధనల మేరకు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.