ప్రత్యేక ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి
- అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశాలు
- నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని, అర్హులైన ప్రతి పౌరుడి పేరును జాబితాలో నమోదు చేయడంతో పాటు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ పెండింగ్ దరఖాస్తులను ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
మంచిర్యాల జిల్లా నుండి ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ సహా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేశామని సీఈఓకు వివరించారు. బీఎల్ఓలు, ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సమన్వయంతో గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, డీఆర్ఓ మోతిరామ్ తదితర అధికారులు పాల్గొన్నారు