పర్వతాపురంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం
పర్వతాపురంలో నూతన పాల సేకరణ భవనం ప్రారంభం – ఎకో మిల్క్ అనలైజర్ ఆవిష్కరణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో తిరువూరు క్లస్టర్ పరిధిలో నూతన పాల సేకరణ భవనం ఘనంగా ప్రారంభమైంది. అదే సందర్భంగా పాల నాణ్యతను మెరుగుపరచడం, ఖచ్చితమైన కొలతలను నిర్ధారించేందుకు పర్వతాపురం WMPAలో ఆధునిక ఎకో మిల్క్ అనలైజర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమాన్ని జిల్లా పాలకవర్గ సభ్యులు బొట్టు రామచంద్రరావు, తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్, సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ మేనేజర్ పి. ప్రసాద్ మాట్లాడుతూ నాణ్యతలేని పాల వల్ల రైతులు, పాల సంఘాలు మరియు యూనియన్కు కలిగే నష్టాలను వివరించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎకో మిల్క్ అనలైజర్ ద్వారా పాల నాణ్యతను ఖచ్చితంగా పరీక్షించడం వల్ల రైతులకు సరైన ధర లభించడంతో పాటు పాల సంఘాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పారు.
అలాగే యూనియన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, అధిక ధరలు, ధర వ్యత్యాసాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ పాలక సభ్యులు, గ్రామ సర్పంచ్ మిద్దె శివాజీ, పెద్దలు దేశిరెడ్డి రాఘవరెడ్డి, సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి. నారాయణతో పాటు గ్రామ రైతులు పాల్గొన్నారు.