పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్వోల నిరసన
NTODAY NEWS అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం పిలుపుమేరకు వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్వో అక్బర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వెంకయ్యపాలెంకు చెందిన వీఆర్వో మహమ్మద్ హుస్సేన్ అధిక పని భారం, అలాగే పై అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. వీఆర్వోలపై రోజురోజుకు పనిభారం పెరుగుతోందని దీనివల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్వోల సమస్యలను పరిష్కరించడంతో పాటు అదనపు పని భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని వీఆర్వో అక్బర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మూడు రోజులపాటు నిరసనలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సుబ్రమణి, కేశవులు, రెడ్డమ్మ, రత్నప్ప, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.