ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి ..
ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించి, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించరాదని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణమే న్యాయం చేసి ఆ నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని అదనపు ఎస్పీ గారు ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు మరియు మహిళల ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రానికి రాలేని ప్రజలు తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్ లేదా సబ్ డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వాటిని సైతం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' అర్జీలుగానే పరిగణించి సకాలంలో పూర్తి న్యాయం చేస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి ఇద్దరు దివ్యాంగులు రాగా అదనపు ఎస్పీ గారు వారి వద్దకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించారు. వారి ఫిర్యాదులను చట్ట పరిధిలో పరిష్కరించాలని పీలేరు మరియు ములకలచెరువు సిఐ గారిని ఆదేశించారు.