రానున్న మూడు నెలలు ఎండల తీవ్రత – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న మూడు నెలలు ఎండల తీవ్రత – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి, మార్చి 25: రాష్ట్రంలో రానున్న మూడు నెలలు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశమున్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి సూచించారు. ఆర్టీజీఎస్లో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వడగాల్పుల నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తుల నిర్వహణ శాఖతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఉపాధి కూలీలు ఉదయం 11 గంటలలోపు పనులు ముగించాలనీ, పని ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ, టెంట్లు, ప్రథమ చికిత్స వంటి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నందున పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖలు, జలవనరుల శాఖలు కలిసి ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పశువులకు నీటి కొరత లేకుండా గ్రామాల్లోని తొట్టెలను ట్యాంకర్లతో నింపాలని, రైతులకు పశు గ్రాసంపై సూచనలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖకు తెలిపారు.
వైద్య, ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, విద్యుత్ తదితర శాఖలు హీట్వేవ్ యాక్షన్ ప్లాన్-2026 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో నోడల్ అధికారులను నియమించి సమన్వయం బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఎండ తీవ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. అవసరం లేకపోతే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.
వడదెబ్బ నివారణకు ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, ఉప్పు కలిపిన ద్రవాలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పదార్థాలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారని తెలిపారు. సాధారణ స్థాయికి మించి 4 నుంచి 5.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగితే హీట్వేవ్, 6.4 డిగ్రీలకు మించి పెరిగితే తీవ్రమైన హీట్వేవ్గా పరిగణిస్తారని వివరించారు.
విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ ఈ నెలలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. మార్చి నుంచి మే వరకు వడగాల్పులు అధికంగా ఉండే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వెల్లడించినట్లు చెప్పారు.
ఎండ తీవ్రతపై సమాచారం కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.