రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు
రేపు ఏపీలో తీవ్ర వడగాల్పులు
అమరావతి, మార్చి 26: రాష్ట్రంలో రేపు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశముందని APSDMA హెచ్చరించింది. ఉత్తర ఆంధ్ర, గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రభావం అధికంగా ఉండొచ్చని తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, కాకినాడ జిల్లాలో జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, ఎన్టీఆర్ జిల్లాలో జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో తిరగకుండా ఉండాలని, తగినంత నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలని, తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలని సూచించారు. చిన్నపిల్లలను ఎండలోకి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.