రైతు భరోసా నిధుల జమపై కొత్త ట్విస్ట్.. అర్హులకే సాయం!
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి దశలవారీ విధానానికి బదులుగా ఒకే విడతలో నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సుమారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
గత యాసంగి సీజన్లో రెండు ఎకరాల వరకు మాత్రమే పెట్టుబడి సాయం అందించడంపై విమర్శలు రావడంతో, ఈసారి చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక మార్పులు ఇవే..
జూన్ 30 నుంచి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం.
సుమారు రూ.9 వేల కోట్ల వరకు నిధుల పంపిణీకి ఏర్పాట్లు.
కొత్త పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులను కూడా జాబితాలో చేర్చే అవకాశం.
ఏడున్నర ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించే ప్రతిపాదన పరిశీలనలో.
కేవలం పట్టాదారు పాస్బుక్ ఉన్నవారికే కాకుండా, వాస్తవంగా పంట సాగు చేస్తున్న రైతులకే సాయం అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన.
శాటిలైట్ సర్వే ఆధారంగా ఎంపిక?
రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగు వివరాలను శాటిలైట్ చిత్రాల ద్వారా సేకరించిన ప్రభుత్వం, గ్రామాల వారీగా సాగు విస్తీర్ణాన్ని గుర్తించింది. పైలట్ ప్రాజెక్టులో మంచి ఫలితాలు రావడంతో భవిష్యత్తులో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఏడున్నర ఎకరాల పరిమితి, శాటిలైట్ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక వంటి అంశాలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో చివరకు ఎవరెవరికి రైతు భరోసా నిధులు జమ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది.