రైతుల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి..?
రైతుల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి..? రెడ్డిగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలు
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతే రాజు అంటున్న ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన నాయకులు.. ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యానికి కాటాలు వేశారో, అందులో ఎంత ధాన్యాన్ని లారీల ద్వారా తరలించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతులు సొంత ఖర్చులతో ధాన్యం తరలించినప్పటికీ రవాణా చార్జీలు, హమాలి కూలీల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
100 కిలోల ధాన్యానికి 125 కిలోలుగా కటింగ్ వేస్తూ అదనంగా 25 కిలోలు ఎందుకు నమోదు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రైతులు స్వయంగా రవాణా చేసిన ధాన్యానికి సంబంధించిన హమాలి కూలీల డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని నిలదీశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు భరించిన రవాణా ఖర్చులు, హమాలి చార్జీలను మిల్లర్ల నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఒక్క రెడ్డిగూడెం సొసైటీ ద్వారానే సేకరించిన ధాన్యానికి సంబంధించి సుమారు రూ.25 లక్షలు కిరాయి రూపంలో బడా నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. దీనిపై సొసైటీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని, లేకపోతే రైతు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ, ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చాట్ల రాబర్ట్ పాల్గొన్నారు.