చాట్రాయి అంటే ఎంపీకి ఎందుకంత దూరం..? రెండేళ్లుగా అడుగుపెట్టని పుట్టా మహేష్ కుమార్ యాదవ్పై పెరుగుతున్న ప్రశ్నలు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధితోనే ఏలూరు జిల్లా ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీ చేసి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు.
ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. మిగిలిన ఆరు నియోజకవర్గాలను పక్కన పెడితే, నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎంతమంది ప్రజానికానికి తెలుసు అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిపోయినా, ఎంపీ నూజివీడు నియోజకవర్గంలో మూడు, నాలుగు సార్లకు మించి కనిపించిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చాట్రాయి మండలానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు, పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఇదే ఇప్పుడు అనేక అనుమానాలకు, రాజకీయ చర్చలకు దారితీస్తోంది.
చాట్రాయి మండలమంటే ఎంపీకి చిన్నచూపా? లేక ఈ మండలం పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమా? ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులు, గెలిచిన తర్వాత ప్రజల మధ్యకు రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
"లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక" అన్నట్లుగా అసలు కారణాలు బయటకు రాకపోయినా, రాజకీయ వర్గాల్లో మాత్రం అనేక కోణాల్లో చర్చ సాగుతోంది.
మంత్రి కొలుసు పార్థసారధి సారథ్యంలో చాట్రాయి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ప్రజా సమస్యల పరిష్కార సమావేశాలు జరిగాయి. కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా ఏలూరు ఎంపీ పాల్గొనకపోవడం గమనార్హం.
కనీసం మర్యాదపూర్వకంగా అయినా ఒకసారి మండలానికి వచ్చి ప్రజలను కలవడం, పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడం, స్థానిక సమస్యలు తెలుసుకోవడం వంటి కార్యక్రమాలు కూడా జరగకపోవడం ఇప్పుడు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది.
ఒక ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ పరిధిలోని ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంట్ సభ్యుడు అంటే కేవలం ఢిల్లీలో ఉండి సభలకు హాజరుకావడం మాత్రమే కాదు. తన పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం, ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత.
అయితే చాట్రాయి మండలం విషయంలో ఈ బాధ్యత నెరవేరిందా అనే ప్రశ్నకు సమాధానం మాత్రం కనిపించడం లేదు.
రాజకీయ విశ్లేషకులు మరో ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. మంత్రి కొలుసు పార్థసారధి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాల కారణంగా ఎంపీ దూరంగా ఉంటున్నారా? పార్టీ అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? లేక స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడటం లేదా? అనే చర్చ కూడా జరుగుతోంది.
చాట్రాయి మండల ప్రజలు మాత్రం ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో మా ఓట్లు కావాలి... ఎన్నికల తర్వాత మా సమస్యలు అవసరం లేదా?
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా, మండలంలో ఒక్క సమావేశం కూడా నిర్వహించకుండా, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనకుండా రెండేళ్లు గడవడం సాధారణ విషయం కాదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా దాని ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చాట్రాయి మండలంపై దృష్టి సారిస్తారా? ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటారా? లేక చాట్రాయి మండలం ఇలాగే ఎంపీ అడుగులకు దూరంగానే మిగిలిపోతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.