రెండు నిమిషాల్లో ఐదు కాట్లు.. 35 యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లతో మహిళకు ప్రాణాపాయం తప్పింది
రెండు నిమిషాల్లో ఐదు కాట్లు.. 35 యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లతో మహిళకు ప్రాణాపాయం తప్పింది
మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ పాముకాటు ఘటన తీవ్ర కలకలం రేపింది. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఓ మహిళపై భారీ నాగుపాము ఐదుసార్లు కాటు వేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. అయితే వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పాములు, ఇతర విషసర్పాలు నివాస ప్రాంతాల్లోకి వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్మదాపురం జిల్లా పిపారియా గ్రామానికి చెందిన రాధాబాయి తన ఇంటి వంటగదిని శుభ్రం చేస్తుండగా, అక్కడ దాక్కున్న సుమారు ఐదు అడుగుల భారీ నాగుపాము ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది.
ఏం జరుగుతుందో గ్రహించేలోపే రెండు నిమిషాల్లోనే ఆమె కుడిచేతిని వరుసగా ఐదుసార్లు కాటు వేసింది. తీవ్ర నొప్పి, విష ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన కుటుంబ సభ్యులు మొదట క్షుద్రపూజల కోసం తీసుకెళ్లడంతో విలువైన సమయం వృథా అయింది. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది.
ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హుటాహుటిన పిపారియా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె రక్తపోటు ప్రమాదకర స్థాయికి చేరుకోగా, చేయి తీవ్రంగా వాచిపోయింది. వైద్యులు వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స ప్రారంభించారు.
డాక్టర్ దేవేంద్ర అహిర్వార్ నేతృత్వంలోని వైద్య బృందం తొలి 40 నిమిషాల్లోనే 10 యాంటీ స్నేక్ వెనం (ASV) ఇంజెక్షన్లు అందించింది. అనంతరం విష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు 24 గంటల వ్యవధిలో మొత్తం 35 యాంటీ స్నేక్ వెనం ఇంజెక్షన్లు ఇచ్చారు.
చేయిలో ఏర్పడిన తీవ్రమైన వాపు, కణజాలాలపై ఒత్తిడి తగ్గించేందుకు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించారు. చికిత్సకు ఆమె శరీరం సానుకూలంగా స్పందించడంతో విష ప్రభావం క్రమంగా తగ్గిపోయింది. శస్త్రచికిత్స కూడా విజయవంతం కావడంతో 24 గంటలపాటు నిశిత పర్యవేక్షణ అనంతరం వైద్యులు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
ఈ ఘటన మరోసారి పాముకాటు జరిగినప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందని వైద్యులు సూచిస్తున్నారు.