రమణక్కపేట సాగుదారుల భూములకు పట్టాలు మంజూరు చేయాలి
రమణక్కపేట సాగుదారుల భూములకు పట్టాలు మంజూరు చేయాలి
సమాచార హక్కు చట్టం ప్రకారం ఆక్రమణదారుల జాబితా ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్
నూజివీడు, ఆగస్టు 17:
ఏలూరు జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముసునూరు మండలం రమణక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో సాగు చేస్తున్న రైతుల భూములకు పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య డిమాండ్ చేశారు.
రమణక్కపేట గ్రామంలో అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలని కోరుతూ సాగుదారులు ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టు విజయవాడలో క్లెయిమ్లు దాఖలు చేసినట్లు తెలిపారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో 2023లో అటవీ, రెవెన్యూ అధికారులు రైతుల సమక్షంలో సంయుక్త సర్వే నిర్వహించారని చెప్పారు.
ఈ సర్వేలో 225 మంది సాగుదారులు 412.34 ఎకరాల భూమిని సాగు చేస్తున్నట్లు గుర్తించి, ఆ భూములు అటవీ భూములుగా నమోదు ఉన్నాయని ఎండార్స్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ELR 202306261114 నంబర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
సాగులో ఉన్న రైతుల వివరాలు, ఆక్రమణదారుల జాబితాను ఇవ్వాలని కోరుతూ 2026 మే 9న సమాచార హక్కు చట్టం కింద నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసినట్లు బక్కయ్య తెలిపారు. ఆ దరఖాస్తును ముసునూరు తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ చేశారని చెప్పారు.
అయితే మూడు నెలల తర్వాత ముసునూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి తమ పరిధిలో ఆక్రమణదారుల జాబితా అందుబాటులో లేదంటూ RTI/10.08.2026 నంబర్తో సమాచారం ఇచ్చారని తెలిపారు. అనంతరం ఆగస్టు 17న సబ్ కలెక్టర్ను కలిసి సమాచార హక్కు చట్టం ప్రకారం జాబితా అందించాలని కోరినట్లు చెప్పారు.
అక్రమదారుల జాబితా ఇస్తే వారు సాగులో ఉన్నట్లు గుర్తించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారని, అయితే సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని అందించడం అధికారుల బాధ్యత అని వేముల బక్కయ్య అన్నారు. సాగుదారులను గుర్తించి వారికి చట్టబద్ధమైన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
2026 మార్చి 2న ఏలూరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్కు రమణక్కపేట సాగుదారుల సమస్యపై వినతిపత్రం అందించినట్లు తెలిపారు. దీనిపై గ్రామంలోనే సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సూచించినట్లు చెప్పారు.
అయితే నూజివీడు అటవీ శాఖ అధికారులు గ్రామంలో సమావేశం నిర్వహించకుండా రైతులను నూజివీడుకు పిలిపించి వారి సమస్యలు విన్నారని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని తెలిపారు.
రమణక్కపేట సాగుదారుల జాబితాను సమాచార హక్కు చట్టం ప్రకారం అందించాలని, జాయింట్ కలెక్టర్ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు వేముల బక్కయ్య పేర్కొన్నారు.
అలాగే మంత్రి కొలుసు పార్థసారధి రమణక్కపేట సాగుదారుల భూముల సమస్యపై సమీక్ష నిర్వహించి, అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.