రంజాన్ శుభాకాంక్షలు… మతసామరస్యానికి పిలుపునిచ్చిన కృష్ణా జిల్లా ఎస్పీ
రంజాన్ శుభాకాంక్షలు… మతసామరస్యానికి పిలుపునిచ్చిన కృష్ణా జిల్లా ఎస్పీ
మచిలీపట్నం: కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకోవాలని, సమాజంలో సోదరభావం వెల్లివిరియాలని పిలుపునిచ్చారు.
ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా అందరూ కలిసి ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ అవతరించిన రంజాన్ మాసంలో ముస్లింలు నెలరోజుల పాటు కఠిన నియమనిష్ఠలతో ఉపవాస దీక్షలు పాటిస్తూ అల్లాహ్ను ఆరాధిస్తారని తెలిపారు. ఈ కాలంలో భక్తి, నియమం, సహనం ప్రధానంగా నిలుస్తాయని చెప్పారు. అల్లాహ్ కరుణ పొందేందుకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ, బీద-ధనిక తేడా లేకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఈ పండుగ ప్రత్యేకతగా వివరించారు.
దాతృత్వం, క్రమశిక్షణ, ధార్మిక చింతనల సమ్మేళనమే రంజాన్ మాస మహిమాన్వితం అని, ఇది సర్వమత ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సద్భావన, సర్వమానవ సమతను బలపరిచే పండుగగా రంజాన్కు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు.
ఈ పవిత్ర పర్వదినం ముస్లిం సోదరుల కుటుంబాల్లో సుఖసంతోషాలు నింపాలని, ఆయురారోగ్యాలతో నిండాలని, ప్రతి ఇంటిలో ఆనంద కాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కుల, మత భేదాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యంతో ముందుకు సాగాలని ఎస్పీ పేర్కొన్నారు.