రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్
కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ప్రకారం వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్ తనకు ఉన్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు. ఆ స్థలానికి కొత్త ఇంటి నంబరు మంజూరు చేయడం, ఇంటి పన్ను నమోదు చేయడం కోసం గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ను సంప్రదించాడు.
దీనికి సంబంధించి స్థల అప్రూవల్తో పాటు ఇంటి నంబరు మంజూరు చేస్తానని చెప్పిన సెక్రటరీ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. అనంతరం బేరసారాల తర్వాత రూ.45 వేలకు ఒప్పందం కుదిరింది. అందులో ముందుగా రూ.40 వేలు ఇవ్వాలని, పని పూర్తయిన తరువాత మిగతా రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.
లంచం ఇవ్వాల్సి రావడంతో బాధితుడు సతీశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం డబ్బులు తీసుకుని వెల్దుర్తి గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లాడు. అనంతరం సెక్రటరీ సూచన మేరకు హైవే–44 ఆంజనేయస్వామి కూడలి వద్ద కర్నూలు వైపు ఉన్న టీ స్టాల్ వద్దకు వెళ్లాడు.
అక్కడ ముందుగానే మాటువేసిన ఏసీబీ డీఎస్పీ సోమన్న బృందం, సతీశ్ నుంచి రూ.40 వేల లంచం తీసుకుంటుండగా సెక్రటరీ లక్ష్మీనాథ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకుంది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.