రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు
రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు కృష్ణారావుపాలెం చెక్పోస్ట్ వద్ద పోలీసుల చైతన్యం
చాట్రాయి, మార్చి 25: ఏలూరు జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో గల చెక్పోస్ట్ వద్ద రోడ్డు భద్రతపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ సిబ్బందితో కలిసి వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో అధిక శాతం తలకు గాయాల వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ఐఎస్ఐ గుర్తింపు కలిగిన నాణ్యమైన హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు.
అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని, వేగ పరిమితులను తప్పక పాటించాలని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల తాము మాత్రమే కాక ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని తెలిపారు. వాహనం నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెక్పోస్ట్ వద్ద వాహనదారులను ఆపి గులాబీ పూలు అందజేస్తూ, కౌన్సెలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నియమాలపై చైతన్యం కల్పించారు. ప్రజలు పోలీసులకు సహకరించి ప్రమాదరహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అధికారులు కోరారు. “నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యం చేరుదాం” అని నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.