సాకారమైన పేదల దశాబ్దాల కల
సాకారమైన పేదల దశాబ్దాల కల
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని పోరాట నగర్లో పేదల దశాబ్దాల కల సాకారమైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదేశాలతో పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
పోరాట నగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు స్థలాలకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి పక్కా గృహాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన ఆయన పేదలకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
దీనిపై స్పందించిన రెవిన్యూ శాఖ అధికారులు సర్టిఫికెట్లను సిద్ధం చేయగా, మంగళవారం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 60 మందికి ఈ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎన్నేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. త్వరలోనే వీరికి పక్కా గృహాలు కూడా మంజూరు కానున్నాయి.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ)తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.