సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం
సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగం బట్టబయలు – 13 సిలిండర్లు స్వాధీనం
వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న అక్రమ వ్యవహారం ఏలూరు జిల్లాలో బయటపడింది. విశ్వసనీయ సమాచారంపై రీజినల్ విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారి కె. నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులు ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని ఓంకారేశ్వరి బిర్యానీ హోటల్, శ్రీ విఘ్నేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వీట్ హోమ్, అలాగే భీమడోలు మండలం ఎం.ఎం.పురం గ్రామంలోని సునీల్ కిరాణా షాపు, హాట్ చిప్స్ వద్ద అక్రమంగా గృహ గ్యాస్ సిలిండర్ల వినియోగం గుర్తించారు.
మొత్తం 13 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో యజమానులు వాణిజ్య అవసరాలకు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు అంగీకరించారు.
సుమారు రూ.31,079 విలువైన సిలిండర్లను సీజ్ చేసి, సంబంధిత యజమానులపై నిత్యవసర వస్తువుల చట్టం, 1955 ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్ఐ కె. నాగరాజు, రెవెన్యూ మరియు పౌర సరఫరా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.