సీఎం సభకు ముస్తాబు అవుతున్న నకరేకల్
ఏర్పాట్లు పరిశీలించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 5వ తేదీ శనివారం నకిరేకల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మినీ స్టేడియంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవర్, వివిధ శాఖల అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సభకు హాజరయ్యే ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, భద్రత, తాగునీరు తదితర అంశాలపై అధికారులతో చర్చించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 1000 రోజులు పూర్తయ్యాయని అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంస పాలన నుంచి తెలంగాణ నేడు వికాసం వైపు వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా నకిరేకల్లో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని ఎమ్మెల్యే విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి కీలక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వారు అసెంబ్లీకి హాజరుకాకపోవడం వల్ల ఒక దళిత నేతకు దక్కాల్సిన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా పోయిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు.