సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డా. వి. రవీంద్ర
తిరువూరు, జూలై 23: వర్షాకాలం, శీతాకాలంలో వాతావరణ మార్పుల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు వీటి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు డా. వి. రవీంద్ర సూచించారు.
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల నివారణపై రూపొందించిన కరపత్రాలను గురువారం తిరువూరులోని జ్యోతి నర్సింగ్ హోంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. గంగాధర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. హరికృష్ణ, జిల్లా కార్యదర్శి ఎం. రాంప్రదీప్, తిరువూరు మండల అధ్యక్షుడు పి. శీనయ్య, ఏ. కొండూరు మండల గౌరవాధ్యక్షుడు పి. శోభన్ బాబు, గంపలగూడెం ప్రధాన కార్యదర్శి బి. సైదులు, నాయకులు ఎస్.డి. సుభాని, పి.వి. శరత్ బాబు, పి. రామకృష్ణ, కె. వెంకటేశ్వరరావు, నాగ శిరోమణి, అలీ బాబా తదితరులు పాల్గొన్నారు.