సీపీ సజ్జనార్పై మేజిస్ట్రేట్కు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు
సీపీ సజ్జనార్పై మేజిస్ట్రేట్కు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు
విచారణలో బెదిరింపులు, దురుసు ప్రవర్తనకు పాల్పడ్డారంటూ ఆరోపణలు.. అత్తాపూర్ పోలీసులకు నోటీసులు
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తనను విచారించిన సమయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అనుచితంగా ప్రవర్తించడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి ఉప్పర్పల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ సమయంలో సీపీ సజ్జనార్ కూడా అభ్యంతరకరంగా మాట్లాడారని, తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ ముగిసిన అనంతరం పోలీసులు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా తనపై జరిగిన వ్యవహారాన్ని మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. విచారణ సమయంలో తనను టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి కొట్టారని, వేధింపులకు గురిచేశారని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది.
సీసీటీవీలు లేని ప్రాంతంలో విచారణ?
తనను విచారించిన ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు లేవని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్కు తెలిపినట్లు సమాచారం. కస్టడీ విచారణకు సంబంధించి నిబంధనలను పాటించారా లేదా అనే అంశంపై కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మేజిస్ట్రేట్ అత్తాపూర్ పోలీసులను వివరణ కోరినట్లు సమాచారం.
సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశంలో విచారణ ఎలా నిర్వహించారనే అంశంపై అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు మేజిస్ట్రేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
సజ్జనార్తో పాటు విచారణలో పాల్గొన్న పోలీసులపై ఫిర్యాదు
కస్టడీ సమయంలో తనను విచారించిన ప్రతి పోలీసు అధికారిపై ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సీపీ సజ్జనార్తో పాటు విచారణలో పాల్గొన్న ఇతర పోలీసులకు కూడా నోటీసులు ఇవ్వాలని ఆయన మేజిస్ట్రేట్ను కోరినట్లు సమాచారం. విచారణలో రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్రావు పాల్గొనడంపై కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తనపై మాత్రమే కాకుండా తన తరఫున న్యాయపరంగా పోరాడుతున్న న్యాయవాదులను కూడా బెదిరించారని ఉదయ్ కృష్ణారెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించినట్లు సమాచారం. న్యాయవాదులను సైతం చంపేస్తామని బెదిరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులనూ బెదిరించారని ఆరోపణ
విచారణ సమయంలో తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్లు ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా తనతో పాటు మరో 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్ అధికారుల భవిష్యత్తును కూడా నాశనం చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
కస్టడీలో తనపై జరిగిన పరిణామాలను వివరిస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ఎదుట కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. దీంతో మేజిస్ట్రేట్ సమక్షంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. అనంతరం మేజిస్ట్రేట్ అందరినీ బయటకు పంపించి, ఉదయ్ కృష్ణారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం.
అత్తాపూర్ పోలీసులకు కోర్టు నోటీసులు
కస్టడీ విచారణలో పోలీసుల వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు కోర్టు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అత్తాపూర్ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సీసీటీవీ కెమెరాలు లేని ప్రదేశంలో విచారణ నిర్వహించడంపై ప్రత్యేకంగా వివరణ కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు కస్టడీ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఉదయ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోర్టు విచారణలో ఈ ఆరోపణలపై ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.