ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ
సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శిపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేంద్ర కమిటీ
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొన్ని పత్రికలు, మీడియా సంస్థలు సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.
అదే పేరుతో ఉన్న ఓ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి వ్యవహారానికి సంబంధించి వార్తలను ప్రసారం చేస్తూ, కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య ఫోటోను ప్రచురించడం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ఆ నాయకుడి నివాసంలో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నాయకుడి చిత్రాన్ని ఉపయోగించడం పూర్తిగా తప్పుదోవ పట్టించే చర్య అని తెలిపింది.
ఇలాంటి తప్పుడు సమాచారాన్ని దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసి పార్టీ నాయకుడి ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ అన్నారు.
ఈ విషయంలో సంబంధిత పత్రికలు, మీడియా సంస్థలు తమ తప్పును వెంటనే సరిదిద్దుకుని, ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.