ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి.. ఎండీఎం భోజనం రుచిగా, శుచిగా ఉండాలి: ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్
చాట్రాయి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఎంఈఓ-1 మాసగిరి శ్రీనివాస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సీ. గుడిపాడు ఎంపీపీఎస్ ప్రధాన పాఠశాలను సందర్శించి పాఠశాల రికార్డులను పరిశీలించారు.
అనంతరం చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలకు హాజరు నమోదు చేసుకోవాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై, అలాగే పాఠశాల పని వేళల్లో ముందస్తు అనుమతి లేకుండా విధులు విడిచి వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తదుపరి మధ్యాహ్న భోజన (ఎండీఎం) పథకం అమలును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. భోజనాన్ని ఎల్లప్పుడూ రుచికరంగా, శుభ్రంగా తయారు చేసి విద్యార్థులకు వడ్డించాలని ఎండీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.
ఈ తనిఖీల్లో సీ. గుడిపాడు ప్రధానోపాధ్యాయురాలు హేమ నాగశ్రీ, చిన్నంపేట జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి పాల్గొన్నారు.