సహజ వ్యవసాయం, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన
50-60 మి.మీ వర్షం పడ్డాకే విత్తనాలు నాటాలి
హాజీపూర్లో ఎన్.ఎమ్.ఎన్.ఎఫ్ (NMNF) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
మంచిర్యాల డివిజన్ హాజీపూర్ మండలంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆధ్వర్యంలో శుక్రవారం (19.06.2026) రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పశుపోషణతో సహజ వ్యవసాయానికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, రైతులు తమ పొలంలోనే సొంతంగా బీజామృతం, జీవామృతం తయారు చేసుకునే విధానాలను, బహుళ పంటల సాగు ఆవశ్యకతను అధికారులు తెలియజేశారు. ఈ సదస్సులో మంచిర్యాల ఏడీఏ (ADA) మామిడి క్రిష్ణ, హాజీపూర్ వ్యవసాయ అధికారి క్రిష్ణ, ఏఈవో మధుప, కృషి సఖి స్వప్నతో పాటు పలువురు సేంద్రీయ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
ప్రస్తుతం పొంచివున్న ఎల్-నినో (El Nino) ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఈ సదస్సులో అధికారులు రైతులకు కీలక సూచనలు చేశారు. తొలకరికే ఆత్రుతపడి విత్తనాలు నాటవద్దని, కనీసం 50-60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, 3-4 రోజుల పాటు వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు నాటాలని స్పష్టం చేశారు. అలాగే నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరికి బదులుగా ఆరుతడి పంటలైన పప్పుదినుసులు, జొన్నలు వంటి మెట్ట పంటలను సాగుచేయాలని, పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగు పట్ల ఆసక్తి చూపాలని రైతులకు దిశానిర్దేశం చేశారు