సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ₹30 లక్షల ప్రమాద బీమా: ఎస్బీఐ మేనేజర్కు ఘన సన్మానం
మంచిర్యాల :ఎస్బీఐ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న 70 సంవత్సరాల లోపు సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు, కోల్ మైన్స్ పెన్షనర్లకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ మేనేజర్ అలోక్ వర్మను సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పూల బొకే అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం మేనేజర్ అలోక్ వర్మ మాట్లాడుతూ.. ప్రమాదవశాత్తు మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు ఈ బీమా ఆసరాగా నిలుస్తుందని, ఈ అవకాశాన్ని పెన్షన్ దారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 130 ఏళ్ల సింగరేణి చరిత్రలో విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ఇందుకు సహకరించిన ఎస్బీఐ యాజమాన్యానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్దా ప్రకాష్, డైరెక్టర్ పా. గౌతమ్ పోట్రులకు సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ ఘన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంక్ అకౌంటెంట్ రంజిత్ కుమార్, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షులు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఏ. గంగయ్య, పి. రాంరెడ్డి, బూర్ల జ్ఞాని, కార్యదర్శి అడిచర్ల రాజేశం, సంఘం నాయకులు గుజ్జ చందు, సర్వేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు