www.ntodaynews.com
బోధనలు గిరిజన సమాజానికి దిశానిర్దేశం
తెలంగాణ
సంత్ సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి దిశానిర్దేశం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: హైదరాబాద్
లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవం, సామాజిక సంస్కర్త సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరానికి మార్గదర్శకమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సేవాలాల్ జీవితం – సమాజానికి స్ఫూర్తి
అనంతపురం జిల్లా రామ్ నాయక్ తండలో జన్మించిన సంత్ సేవాలాల్ జీవితాంతం గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేశారని మంత్రి పేర్కొన్నారు. మద్యపానం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారని, సత్యం, శ్రమ, సమానత్వం వంటి విలువలతో గిరిజన సమాజంలో చైతన్యం నింపారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 17న సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ప్రత్యేక సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు.
గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం
గిరిజన సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు.
గిరిజన విద్యాభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఐటీడీఏలను బలోపేతం చేస్తూ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలను విస్తరిస్తున్నట్లు చెప్పారు.
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందిస్తున్న ఉచిత కోచింగ్ ద్వారా గిరిజన విద్యార్థులు ఐఐటీ, జేఈఈ, నీట్ పరీక్షల్లో రాణిస్తూ ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాపాలన శిక్షణతో అనేక మంది గిరిజన యువత డీఎస్పీ, ఆర్డీవో వంటి ఉన్నత పదవుల్లో ఎంపికవుతున్నారని తెలిపారు.
“విద్యే ఆయుధం.. సమానత్వమే లక్ష్యం.. గిరిజనుల ఆత్మగౌరవమే ప్రభుత్వ ధ్యేయం” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు.
#SantSevalal #TribalWelfare #AdluriLaxmanKumar #HyderabadEvent #TribalDevelopment #SocialReform
Follow us on
Website
Facebook
Instagram
YouTube