సర్పంచ్లకు చెక్… చెల్లింపులపై కట్టడి
సర్పంచ్లకు చెక్… చెల్లింపులపై కట్టడి
ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనున్న సర్పంచ్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు బుధవారం నుంచి సర్పంచ్ల ప్రత్యక్ష చెల్లింపుల అధికారాన్ని నిలిపివేసింది. ఇప్పటి వరకు సర్పంచ్లు సిఎఫ్ఎమ్ఎస్ ద్వారా బిల్లులకు థంబ్ వేస్తే నేరుగా ట్రెజరీకి వెళ్లే విధానం ఉండేది. ఇకపై ఆ బిల్లులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ) లాగిన్కు వెళ్లి, ఆయన ఆమోదించిన తరువాత మాత్రమే ట్రెజరీకి చేరుతాయి. జీతాలు వంటి అత్యవసర చెల్లింపులకు కూడా డీడీఓ అనుమతి తప్పనిసరి చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్లు, కార్యదర్శులు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కూడా పదవీకాలం ముగిసే ముందు చెక్ పవర్ రద్దు చేసి చెక్బుక్లను స్వాధీనం చేసుకునే పద్ధతి ఉండగా, ఇప్పుడు సిఎఫ్ఎమ్ఎస్ విధానంలోనే ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం సిద్ధం
సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో వచ్చే నెల 3వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మండలాల వారీగా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంఈఓలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ శాఖ అధికారులు, మండల పరిషత్ పరిపాలనాధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించేలా జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఈ బాధ్యతలకు దూరంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వారు పనుల కొలతలు, తనిఖీలు నిర్వహించే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని మండలాల్లో పంచాయతీలు అధికంగా ఉండటంతో ఒక ప్రత్యేక అధికారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే పంచాయతీ వ్యవస్థపై పూర్తి అవగాహన లేకపోవడంతో కొంతమంది అధికారులను నియమించడంపై ఆసక్తి తక్కువగా ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,069 గ్రామ పంచాయతీలు ఉండగా, విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 342, కాకినాడ జిల్లాలో 385, తూర్పుగోదావరి జిల్లాలో 342 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.