సుగాలిమిట్ట ఘాట్ ప్రమాదంలో సేవాభావం.. తండ్రి-కొడుకులను సత్కరించిన సీఐ సుబ్బరాయుడు..
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్ట ఘాట్ వద్ద ఈ నెల 6వ తేదీ రాత్రి జరిగిన లారీ ప్రమాద సమయంలో సేవా దృక్పథంతో స్పందించిన తండ్రి-కొడుకులను పోలీసులు ఘనంగా సత్కరించారు.
రాత్రి సుమారు 10 గంటల సమయంలో రెండు లారీలు ఢీకొనడంతో వాటి ఇంజిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ సమయంలో బోడేవారిపల్లి గ్రామానికి చెందిన కె. భూపతి మరియు ఆయన కుమారుడు మోహిత్ కుమార్ వెంటనే స్పందించి హిటాచీ యంత్రాన్ని సంఘటనా స్థలానికి తెప్పించారు. ప్రమాదానికి గురైన రెండు లారీలను రహదారి పక్కకు తొలగించి, ట్రాఫిక్ను సవ్యంగా పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు.
వారి సేవలను గుర్తించిన పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బందితో కలిసి భూపతి, మోహిత్ కుమార్లను సత్కరించి అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడం ఆదర్శప్రాయమని కొనియాడారు.
స్థానికులు కూడా తండ్రి-కొడుకుల సేవా స్పూర్తిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.