శ్రావణ శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక సేవలు
100 కిలోల పులిహోర, రూ.15 వేల విలువైన స్టీల్ సామగ్రి సమర్పణ
అన్నమయ్య జిల్లా | పుంగనూరు | Ntoday News
పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని మూడో శనివారం ప్రత్యేక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ శనివారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, సులోచన, నమ్రత, శ్రీలక్ష్మీకాంత్ స్వామివారి సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించారు. భక్తులకు ప్రసాద వితరణ కోసం 100 కిలోల పులిహోరను అందించడంతో పాటు, సుమారు రూ.15 వేల విలువైన స్టీల్ సామగ్రిని ఆలయ సేవకు సమర్పించారు.
దాతలు అందించిన సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించినట్లు ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ యశ్వంత్ తెలిపారు. స్వామివారి సేవా కార్యక్రమాలకు భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులు క్రమపద్ధతిలో స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శ్రీనివాసులు, చంగయ్య, సెక్యూరిటీ సిబ్బంది నరసింహులు తదితరులు పాల్గొన్నారు. స్వామివారి సేవకు సహకరించిన దాతలను ఆలయ అధికారులు అభినందించారు.