పెనుగొలను: లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ నగర సంకీర్తన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం శివాలయం ప్రాంగణంలోని శిరిడి సాయిబాబా మందిరం నుంచి భక్తులు లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ భగవన్నామస్మరణ చేస్తూ గ్రామ ప్రధాన వీధుల్లో యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా బొడ్రాయి, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ సభ్యులు డాక్టర్ జీ. నరసింహారావు, సుగ్గల హనుమంతరావు, పాశం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుగొలను: ఘనంగా హనుమాన్ చాలీసా పారాయణం
పెనుగొలను గ్రామంలో శనివారం రాత్రి బొడ్రాయి సెంటర్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
కార్యక్రమ ఏర్పాట్లను నిర్వహణ కమిటీ సభ్యులు బొలగాని నాగయ్య, కోట దాసు, పసుమర్తి లక్ష్మణరావు పర్యవేక్షించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.