సూర్యాపేట జిల్లా ఎర్రగట్టుతండాలో ఉద్రిక్తత..
సూర్యాపేట జిల్లా ఎర్రగట్టుతండాలో ఉద్రిక్తత.. కోదాడ సీఐపై రాళ్ల దాడి
వేపచెట్టు వివాదం హత్యకు దారి.. నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో వేపచెట్టు వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. భూవివాద నేపథ్యంలో భూక్యా సైదా, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెదబాబు, రామ్ నాయక్ సోదరులపై హత్య ఆరోపణలు వచ్చాయి. ప్రత్యర్థి వర్గానికి చెందిన వెంకటేశ్వర్లును నరికి చంపిన ఘటనతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఘటనపై సమాచారం అందుకుని అక్కడికి వెళ్లిన ఎస్సై నవీన్పై కూడా నిందితులు గొడ్డలితో దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎస్సై తలకు గాయాలైనట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు గ్రామానికి వెళ్లిన కోదాడ సీఐ శివశంకర్పై కొందరు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాళ్లు రువ్వినట్లు సమాచారం. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా, కోదాడ పట్టణంలోని 32వ వార్డులో షాపుల తొలగింపు వ్యవహారంపై నిరసన తెలిపిన బాధితుల పట్ల సీఐ శివశంకర్ వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులను తోసివేయడం, కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం వంటి ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
ఎర్రగట్టుతండా ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.