జూబ్లీహిల్స్: చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక సూచనలు..
జూబ్లీహిల్స్: చిన్న నీటిపారుదల వ్యవస్థ బలోపేతానికి కీలక సూచనలు.. సీఎంకు నివేదిక అందించిన రైతు సంక్షేమ కమిషన్
చిన్న నీటిపారుదల రంగం అభివృద్ధి, చెరువుల పరిరక్షణకు సంబంధించి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించింది. జూబ్లీహిల్స్లో జరిగిన సమావేశంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులు రాములు నాయక్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గంగాధర్, ఎం. భవానీరెడ్డి పాల్గొన్నారు.
నివేదికలో ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసిన కమిషన్.. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతిక విధానాలతో ప్రత్యేక చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని సూచించింది.
చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను అనుసంధానం చేసేలా కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చిన్న నీటిపారుదల చట్టాన్ని రూపొందించాలని నివేదికలో తెలిపింది.
రాష్ట్రంలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) సరిహద్దులను తక్షణమే గుర్తించి, ఆక్రమణలను తొలగించి వాటిని పరిరక్షించాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.
తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని కమిషన్ పేర్కొంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ మరింత దృష్టి సారించాలని సూచించారు.
రెండేళ్ల కాలంలో రైతు సంక్షేమ కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సిఫారసులను కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు. కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.